ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అశ్వారావుపేట ఎస్సై దవాఖానలో చికిత్స పొందుతూ మృతి - ఐదుగురిపై కేసు నమోదు

 

(పులి అమృత్ ,సీనియర్ జర్నలిస్ట్ )

 సీఐ, కానిస్టేబుల్స్​ వేధిస్తున్నారని అశ్వారావుపేట ఎస్సై శ్రీరాములు శ్రీను పురుగుల మందు తాగి వారం రోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆయన దవాఖానలో  చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మరణించారు. ఆయన మరణానికి కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును పోలీసులు నమోదు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను ఆత్మహత్యాయత్నం ఘటన విషాదాంతమైంది. హైదరాబాద్‌లోని ఓ దవాఖానలో  చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. సీఐ జితేందర్​ రెడ్డి సహా నలుగురు కానిస్టేబుల్స్​ పనిలో సహకరించకపోవడమే కాకుండా కులం పేరుతో వేధించారని ఆత్మహత్యాయత్నం అనంతరం ఎస్సై శ్రీను ఓ వీడియోలో తన గోడు వెళ్లబోసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

గత నెల 30న స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్లిన ఎస్సై శ్రీను ఎంతకు తిరిగి రాకపోయే సరికి అశ్వారావుపేట పోలీసులు గాలింపు చేపట్టారు. ఈలోగా ఆయనే 108కు ఫోన్​ చేసి తాను మహబూబాబాద్​లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని ఆయన చెప్పారు. ఆ ప్రాంతానికి వెళ్లిన అంబులెన్స్​ సిబ్బంది హుటాహుటిన ఆయనను హైదరాబాద్​ తరలించారు. ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స అందించిన ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి ఎస్సై శ్రీను చనిపోయారు. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు.

ఎస్సై శ్రీను ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అశ్వరావుపేట సీఐ జితేందర్​ రెడ్డిని వరంగల్​ ఐజీకి, నలుగురు కానిస్టేబుల్స్​ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయానికి అటాచ్​ చేశారు. తన భర్త ఆత్మహత్యకు సీఐ జితేందర్​, నలుగురు కానిస్టేబుల్స్​ కారణమని ఎస్సై శ్రీరముల శ్రీను భార్య కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

అసలేం జరిగింది : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను గత జూన్​ 30న మహబూబాబాద్​లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వారం రోజులుగా హైదరాబాద్​లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మణుగూరు పోలీస్​ స్టేషన్​ నుంచి అశ్వారావుపేట పోలీస్​ స్టేషన్​కు ఎస్సై శ్రీను బదిలీపై వెళ్లారు. ఆయన స్వగ్రామం వరంగల్​ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేట. 2014లో ఎస్సైగా ఎంపికయ్యారు.

అశ్వారావుపేట సీఐ జితేందర్​ రెడ్డి, కానిస్టేబుల్స్ శేఖర్​, శివ నాగరాజు, సన్యాసినాయుడు, సుభాని పనిలో  సహకరించలేదని ఎస్సై శ్రీను ఓ వీడియోలో తెలిపారు. అలాగే తనను తీవ్రంగా వేధించారని ఆ వీడియోలో పేర్కొన్నారు. కులం పేరుతో కించపరిచేవారని ఆవేదన వ్యక్తం చేశారు. సహచర సిబ్బంది వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. మరోవైపు సీఐ జితేందర్​ రెడ్డి నాలుగు నెలల్లోనే నాలుగు మెమోలు ఇచ్చారని గోడు వెళ్లబోసుకున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, బదిలీ కోసం చేసిన ప్రయత్నాలు ఆలస్యమయ్యాయని చెప్పారు. అనంతరం ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.






Post a Comment

0 Comments