తెలంగాణలో టీ20 వరల్డ్​ కప్​ గెలుపు సంబురాలు - సెక్రటేరియట్ వద్ద ఫ్యాన్స్ పూనకాలు

 

(PULI AMRUTH)

టీ20 వరల్డ్​ కప్​ ఫైనల్​లో టీమ్​ ఇండియా ఘన విజయం సాధించడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సంబరాలు అంబరాన్నంటాయి. పలుప్రాంతాల్లో క్రికెట్ అభిమానులు, యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి భారత్​ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. టీ20 ప్రపంచకప్​ విజయంపై టీమ్ ఇండియాకు సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్​ నేత కేటీఆర్​ సహా పలువురు శుభాకాంక్షలు తెలిపారు


టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ భారత్ సాధించడంతో రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్ అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి భారత్‌ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. త్రివర్ణ పతాకాల్ని పట్టుకుని ద్విచక్రవాహన ర్యాలీలు నిర్వహించారు. టపాకాయలు కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

 టీ20 ప్రపంచకప్‌ విజయంపై టీమ్‌ ఇండియాకు సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. క్రికెట్‌ ప్రపంచంలో భారత్‌కు ఎదురులేదని మరోసారి నిరూపించారన్నారు. రోహిత్‌ సేన దేశానికి కీర్తిప్రతిష్ఠలు తెచ్చిపెట్టింది సీఎం కొనియాడారు. భారత జట్టు సంచలన ప్రదర్శన చేసిందని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. విరాట్‌కోహ్లి బౌలర్లందరూ అధ్భుతంగా పని చేశారన్నారు. వంద కోట్ల మంది హృదయాలను సంతోషపెట్టినందుకు టీమ్‌ ఇండియాకు కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు.
క్రికెట్ అభిమానుల సంబురాలు : క్రికెట్‌ అభిమానులతో సచివాలయ ప్రాంతం నిండిపోయింది. ట్యాంక్‌ బండ్‌ పరిసర ప్రాంతాల్లో వందలాది మంది అభిమానులు చేరి సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చి కేరింతలు కొడుతూ చిందులేశారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా యువతి, యువకులు రోడ్ల పైకి సందడి చేశారు. అబిడ్స్, చిక్కడపల్లి, అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్‌ రోడ్, కూకట్ పల్లి, మాదాపూర్, పరిసర ప్రాంతాలు జనాలతో కిక్కిరిసిపోయాయి. ర్యాలీలుగా సాగుతూ నినాదాలు చేస్తూ కేరింతలు కొట్టారు.
శేరిలింగంపల్లిలో క్రికెట్ అభిమానుల సంబురాలు : టీ20 ప్రపంచకప్​ మ్యాచ్​లో భారత్​ సత్తా చాటి కప్​ను కైసవం చేసుకోవడంపై శేరిలింగంపల్లిలో క్రీడాభిమానులు సంబరాలు చేసుకున్నారు. యువత భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ఇండియా ఇండియా అంటూ హుషారుగా నినాదాలు చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. జాతీయ జెండాలు పట్టుకుని నృత్యాలు చేశారు. కూకట్​పల్లి ప్రాంతంలోనూ క్రీడాభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఉత్కంఠగా సాగిన మ్యాచ్​లో ఆటగాళ్ల క్రీడాప్రతిభను ప్రశంసిస్తూ వారికి జేజేలు పలుకుతూ కేరింతలు కొట్టారు.

Post a Comment

0 Comments